భారత్ చేరుకున్న 12 చీతాలు..!
టీ మీడియా, ఫిబ్రవరి 18, మధ్యప్రదేశ్ : దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గతేడాది సెప్టెంబర్లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియా నుంచి మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్కు కు వచ్చాయి. శనివారం మరో 12 చీతాలు భారత్ చేరుకున్నాయి. 12 చీతాలతో దక్షిణాఫ్రికా లోని జోహన్నెస్బర్గ్ నుంచి శుక్రవారం సాయంత్రం బయల్దేరిన వాయుసేనకు చెందిన విమానం శనివారం ఉదయం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ కు చేరుకుంది. అక్కడి నుంచి ఈ చీతాలను కూనో నేషనల్ పార్క్కు తరలించనున్నారు.ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ , కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చిరుతలను క్వారంటైన్లోకి పంపనున్నారని చీతా ప్రాజెక్ట్ చీఫ్ ఎస్పీ యాదవ్ తెలిపారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వాటిని 30 రోజులపాటు క్వారంటైన్లో (ఎన్క్లోజర్) ఉంచనున్నామని చెప్పారు. అనంతరం వాటిని పెద్ద ఎన్క్లోజర్లోకి పంపిస్తామన్నారు. ప్రస్తుతం భారత్ చేరుకున్న 12 చీతాల్లో ఏడు మగ చీతాలు కాగా, ఐదు ఆడ చీతాలు ఉన్నాయి. వీటి కోసం కూనో నేషనల్ పార్కులో పది క్వారంటైన్ ఎన్క్లోజర్లను సిద్ధం చేశారు. ప్రతిష్టాత్మకమైన చిరుతల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా గతేడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను కూనో ఫారెస్ట్లో వదిలిన విషయం తెలిసిందే.
Also Read : శ్రీనివాసమంగాపురంలో వైభవంగా రథోత్సవం
వాటిలో ఐదు ఆడవి, మూడు మగవి ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ లార్జ్ ఎన్క్లోజర్లో ఉన్నాయి. దేశంలో 71 ఏండ్ల క్రితం అంతరించి పోయిన చీతాలను ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరిస్తున్నది. ఇందులో భాగంగా ఆఫ్రికా దేశాల నుంచి విడుతల వారీగా దిగుమతి చేసుకుంటున్నది. కాగా, ప్రపంచంలోని 7 వేల చిరుతల్లో అధికంగా దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానాలో నివసిస్తున్నాయి. అయితే ఈ మూడుదేశాల్లో నమీబియాలో చీతాలు అత్యధికంగా ఉన్నాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube