మధ్యాహ్న భోజనంపై ‘ఆధార్’
టీ మీడియా, ఫిబ్రవరి 23,న్యూఢిల్లీ : దేశంలోని అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం (మిడ్డే మీల్) అమలు ఇప్పటికీ సమస్యగానే మిగిలి ఉన్నది. ఈ పథకం అమలులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ పథకాన్ని అధార్కు ముడిపెడితూ కేంద్రం నిర్ణయం ఇప్పుడు కలవరానికి గురి చేస్తున్నది. ఈ పథకాన్ని ఆధార్తో అనుసంధానం చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది.
దేశంలోని ప్రతి ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఆధార్తో ప్రామాణీకరించబడిన విద్యార్థుల సంఖ్య మరియు ప్రతి ఒక్కరికి అందించే భోజనాల సంఖ్యపై కేంద్రం నెలవారీ అప్డేట్లను కోరింది. ఇప్పుడిదే పేద వర్గాలకు చెందిన విద్యార్థులు, వారి కుటుంబాలలో భయాలను రేకెత్తిస్తున్నది. కేంద్రానికి చెందిన పీఎం పోషణ్ పోర్టల్లో తప్పనిసరిగా డేటాను అప్లోడ్ చేయాలని ప్రభుత్వ ఆదేశంతో ఆందోళనలు నెలకొన్నాయని నిపుణులు, సామాజిక కార్యకర్తలు అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద ఆధార్ ఆధారిత వేతన చెల్లింపులపై ఇటీవల కేంద్రం తీరు నేపథ్యంలో మిడ్ డే మీల్పై ఈ అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు.
ఇటు ఆధార్ అనుసంధానంపై ఆందోళనలు వెలువడుతున్నప్పటికీ సంబంధిత విభాగాలు మాత్రం స్పష్టతను ఇవ్వడం లేదు. పాఠశాల విద్యా కార్యదర్శి సంజరు కుమార్కు ఈ విషయంలో ఈ-మెయిల్ పంపినా సమాధానం లేదని సామాజిక కార్యకర్తలు అన్నారు. మధ్యాహ్న భోజనానికి ఆధార్ లింక్ చేయడం వినాశకరమైనదని సామాజిక కార్యకర్త నిఖిల్ డే అన్నారు. దేశంలో చాలా మంది పిల్లలు ఇంకా ఆధార్ కోసం నమోదు చేసుకోలేదని తెలిపారు.
Also Read : రాహుల్ గాంధీ విమర్శలు
ఉచిత పాఠశాల విద్య ఒక హక్కు అనీ, దాన్ని లాభదాయకంగా చూడొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే. అయినా మోడీ ప్రభుత్వం మీడ్ డే మీల్ కు ఆధార్ లింక్ చేయటం లాంటి చర్య.. ఏదైనా చట్ట విరుద్ధం అని, ఏ పాఠశాల ప్రయోజనం అయినా ఆధార్పై షరతులు విధించబడదని ఆర్థికవేత్త, పబ్లిక్ పాలసీ నిపుణుడు జీన్ డ్రేజ్ అన్నారు.ఆధార్-ప్రామాణీకరించబడిన విద్యార్థుల సంఖ్య, జిల్లా అధికారుల నుంచి ప్రతి పాఠశాలకు వచ్చిన నిధులు, నెలలో ఖర్చు చేసిన నిధులు, ఈనెలలో వడ్డించిన భోజనం గురించి నెలవారీ డేటాను కోరుతూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గత నాలుగు నెలల్లో అన్ని రాష్ట్రాలకు రెండు లేఖలు రాసింది. ప్రతినెలా పది లోపు ప్రధాన మంత్రి పోషణ్ పోర్టల్లో డేటాను అప్లోడ్ చేయాలని జాయింట్ సెక్రెటరీ ప్రాచీ పాండే తన లేఖలో పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి ఆధార్ ఫీడ్ చేసిన తర్వాతే మధ్యాహ్న భోజనం పథకంలో ఆధార్ అనుసంధానం విజయవంతం అవుతుందని వివరించారు.
Also Read : ‘పిడుగుల పరమేశ్వరుడి’ ఆలయం విశిష్టత..
గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ , నెట్వర్క్ పనితీరు తక్కువగా ఉండటం, ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది కొరత కారణంగా చాలా పాఠశాలలు జిల్లా అధికారులకు డేటాను పంపడానికి ఇబ్బంది పడతాయని విశ్లేషకులు అన్నారు. ప్రధాన మంత్రి పోషన్ పథకం 11 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతుల వరకు 11 కోట్ల మంది పాఠశాల విద్యార్థులకు ప్రతి రోజు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. అయితే, వీరిలో పేద, అణగారిణ వర్గాల ప్రజలు అధికంగా ఉంటారనీ, ఆధార్ అనుసంధాన ప్రక్రియ వారిని ఈ పథకం నుంచి దూరం చేస్తుందని సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు అన్నారు. ఈ ఆలోచనను కేంద్రం వెనక్కి తీసుకోవాలని సూచించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube