ఘోర ప్రమాదం.. 10మంది సాయిబాబా భక్తులు మృతి
టీ మీడియా, జనవరి 13, మహారాష్ట్ర : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాయిబాబా భక్తులు వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. నాసిక్-షిర్డీ జాతీయ రహదారిపై పతారె వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తి ఉన్నారు. 17 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Also Read : వెయ్యి మందిని తొలగించనున్న అమెజాన్
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube