అవినాష్ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా

అవినాష్ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా

0
TMedia (Telugu News) :

అవినాష్ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా

 

టీ మీడియా, ఏప్రిల్ 17, హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచార‌ణ జ‌రిగింది. ఇరు వర్గాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం విచార‌ణ‌ను నేటికి వాయిదా వేసింది.. అలాగే తీర్పు ఈరోజు మ‌ధ్యాహ్నం వెలువ‌రిస్తామ‌ని పేర్కొంది.
ఈ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ పై అవినాష్ త‌ర‌పు న్యాయ‌వాది త‌న వాద‌న వినిపిస్తూ , ‘వైఎస్ భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. హైకోర్టులో భాస్కర్‌రెడ్డి పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే సీబీఐ అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడానికి దస్తగిరి కాంఫెషన్ తప్ప ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరిని సీబీఐ బెదిరించినట్టు, చిత్రహింసలకు గురిచేసినట్టు ఎర్ర గంగిరెడ్డి చెప్పారు. దస్తగిరి సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అవినాష్ రెడ్డి సహ నిందితుడు అంటూ ప్రచారం జరుగుతోంది. దస్తగిరికి బెయిల్ వచ్చిన తర్వాతి రోజే సీబీఐ వాళ్ళు 306 పిటిషన్ వేశారు. ఆయన్ను అప్రూవర్‌గా మార్చారు. హత్యకు సంబంధించిన ఆధారాలు లేవు. హత్య తర్వాత సాక్షాలు తుడిచివేయడంపై చెబుతున్నారు. సాక్షాలు రూపుమాపడం ఆరోపణ అయితే ఆయన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.

AlsoRead:మహిళలకు భరోసా ఉమెన్స్ హెల్ప్ డెస్క్

 

 

ఎందుకు అంటే దానికి 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షలు లేవు. అన్ని కోణాల్లో విచారించి హత్య ఎవరో చేశారో తేల్చే కోణంలో విచారణ జరగట్లేదు. రాజకీయ కోణంలోనే విచారణ జరుగుతోంది. రాజకీయ కోణంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇరికించే కుట్ర జరుగుతోంది’ అని వివరించారు.
దీనికి కౌంట‌ర్ గా సిబిఐ న్యాయ‌వాది త‌న వాద‌న‌ను కొన‌సాగిస్తూ, ‘ అవినాష్ రెడ్డి నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారు. మూడోసారి విచారణకు రమ్మనప్పుడు 5 రోజులు సమయం తీసుకుని హాజరయ్యారు. ఇప్పుడు విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే మళ్ళీ పిటిషన్ వేశారు. మా తరఫు దర్యాప్తు పూర్తి చేయడానికే నోటీసులు ఇచ్చాం. వివేకా హత్య జరిగిన తర్వాత అవినాష్ పోలీసులకు ఫోన్ చేశారు. ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుల్స్ పంపండి చాలు అని చెప్పారు. అంతేకాదు గుండెపోటుతోనే వివేకా చనిపోయారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యను కప్పిపుచ్చుకునేందుకు సహజ మరణం కింద చిత్రీకరించారు. సాక్షాలు తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారు’ అని తేల్చి చెప్పింది. ఈ సంద‌ర్భ‌గా న్యాయ‌మూర్తి జస్టిస్ సురేందర్ రెడ్డి సిబిఐ న్యాయ‌వాదిని ప్ర‌శ్నిస్తూ, అవినాష్ విచారణకు వస్తే అరెస్ట్ చేస్తారా..? అని అడిగారు. ఇందుకు స్పందించిన సీబీఐ తరఫు న్యాయవాది విచారణ తర్వాత అవ‌స‌ర‌మైతే అవినాష్‌ను అరెస్ట్ చేస్తామని తేల్చిచెప్పారు. దీంతో విచార‌ణ‌ను ఈరోజు ఉద‌యానికి వాయిదా వేశారు న్యాయ‌మూర్తి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube