శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
టీ మీడియా ,మార్చి 29,తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా జరిపారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు.శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేశ్బాబు, వీజీవో బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Also Read : అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన సి ఐ
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube