16 నుంచి శ్రీ కపిలేశ్వరాలయంలో హోమ మహోత్సవాలు
లహరి, జనవరి 14, తిరుపతి : లోక కళ్యాణార్థం తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు ఆరు రోజులపాటు ప్రత్యేక హోమ మహోత్సవాలు జరుగనున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు. 16న శ్రీ గణపతిస్వామి హోమం, జనవరి 17వ తేదీ శ్రీ సుబ్రమణ్యస్వామిహోమం, జనవరి 18న శ్రీ దుర్గ, శ్రీ లక్ష్మీ, శ్రీ సరస్వతి అమ్మవార్ల హోమం, జనవరి 19న శ్రీ నవగ్రహ హోమం నిర్వహిస్తారని వెల్లడించారు. 20న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, జనవరి 21న శ్రీ రుద్ర ,శ్రీ మృత్యుంజయ స్వామి వారి హోమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
Also Read : బిఆర్ఎస్ క్యాలెండర్ఆవిష్కరణ
ఎస్వీ గోశాలలో ‘గోపూజ మహోత్సవం
తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో 16న కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి వేణుగానం, 8 నుంచి 9 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేస్తారని అన్నారు. 8 నుంచి 10.30 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. గోపూజ మహోత్సవం రోజున గోవులకు బెల్లం, బియ్యం, గ్రాసం భక్తులు స్వయంగా తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోందన్నారు.