కాళీ మాత ఆలయం.. అక్కడ నూడుల్సే నైవేద్యం
లహరి, మార్చి 3, కోల్కతా : భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్నో సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతుల మిశ్రమం. అందుకే ఇండియాకి విదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. మన దేశ ఆలయాలు, చారిత్రక సంపద, పండుగలు ఆచార వ్యవహారాలంటే విదేశీయులకు చాలా ఇష్టం. మనం దేవుళ్లను పూజించే విధానం, భక్తి శ్రద్ధలను విదేశీయులు ఎంతగానో ఇష్టపడతారు. అదే విధంగా మన దేశంలోని వేర్వేరు ప్రార్థనా స్థలాల దగ్గర ఇచ్చే నేవైద్యం ప్రసాదాలు వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా ఆలయాల్లో లడ్డూ ప్రసాదం ఉంటుంది. అదే విధంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా లో… ప్రత్యేక ఆలయం ఉంది. అక్కడ దేవుడికి నైవేద్యంగా నూడుల్స్ పెడతారు. భక్తులకు కూడా నూడుల్సే ప్రసాదంగా ఇస్తారు.
కోల్కతాలోని చైనా టౌన్ లో తంగ్రా అనే ఫేమస్ ఏరియా ఉంది. అక్కడ చైనీస్ కాళీ మాత ఆలయం ఉంది. ఈ ఆలయం, చుట్టూ ఉన్న పరిసరాలకు వెళ్తే… ఇండియాలో ఉన్నట్లు అనిపించదు. చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్, టిబెట్ లాంటి దేశాల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అక్కడి ఆచార వ్యవహారాలన్నీ తూర్పు ఆసియా దేశాల వారు పాటించేవిలా ఉంటాయి. అందుకే కోల్కతాకు వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా అక్కడకు వెళ్తుంటారు.
కాళీ మాత ఆలయం మన దేశంలోని ఇతర కాళీ మాత ఆలయాలలాగే ఉంటుంది. కాళీ మాత కూడా అలాగే ఉంటుంది. ప్రత్యేకతల్లా ప్రసాదమే. ఎంత మంది భక్తులు వచ్చినా… అమ్మవారికి నైవేద్యం సమర్పించాక… భక్తులకు న్యూడుల్స్ ప్రసాదంగా ఇస్తారు. నూడుల్స్తోపాటూ… చాప్ సుయ్, స్టిక్కీ రైస్ వంటివి కూడా ఇస్తారు. అందువల్ల ఇక్కడికి వెళ్లిన వారికి కొత్తగా, విచిత్రంగా అనిపిస్తుంది.
Also Read : మేఘాలయా సీఎం రాజీనామాకు గవర్నర్ ఆమోదం
ఇలా ఎందుకు?
ఇక్కడి స్థానికుల్లో ఎక్కువ మంది చైనీయులే. వారంతా ఇండియాలో స్థిరపడిపోయారు. కాబట్టి వారు భారతసంస్కృతులనుపాటిస్తూ… వాటికి చైనా సంస్కృతులను సమ్మిళితం చేశారు.
మీడియా రిపోర్టుల ప్రకారం ఈ ఆలయం 80 ఏళ్ల నాటిది. 60 ఏళ్లుగా హిందువులు… ఓ చెట్టు కింద… రెండు దేవతా విగ్రహాల్ని పూజిస్తూ వచ్చారు. ఆ తర్వాత అక్కడే ఆలయం నిర్మించారు. గత 20 ఏళ్లుగా బెంగాలీ ప్రజలు, చైనా ప్రజలు కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. అందువల్లే ఇక్కడ ప్రత్యేక సంస్కృతి కనిపిస్తుంది.
స్థానికుల ప్రకారం… ఇక్కడ ఒకప్పుడు పదేళ్ల చైనా పిల్లాడికి అనారోగ్యం వచ్చింది. ఎవరూ అతన్ని సరిచేయలేకపోయారు. తల్లిదండ్రులు చేసిన అన్ని ప్రయత్నాలూ వృథా అయ్యాయి. ఆ సమయంలో ఎవరో వారికి… స్థానిక చెట్టుకింది అమ్మవారికి పూజలు చెయ్యమని చెప్పారు. అమ్మవారిపై అంతగా నమ్మకం లేకపోయినా ఆ చైనా దంపతులు… పూజలు చేశారు. అంతే… కొన్ని రోజుల్లోనే పిల్లాడి అనారోగ్యం పోయింది. తిరిగి మామూలు స్థితికి వచ్చేశాడు. దాంతో ఆ పేరెంట్ మళ్లీ వెళ్లి అమ్మవారికి పూజలు చేశారు. అలా… చైనీయులకు ఆ అమ్మవారిపై అచంచలమైన భక్తి కలిగింది. అలా చైనీయులే ఇప్పుడా ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ… అభివృద్ధి చేస్తున్నారు.