మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత
టీ మీడియా, ఫిబ్రవరి 15, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కుతూహలమ్మ వైద్యురాలిగా పనిచేశారు. ఆ తర్వాత తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో చిత్తూరు జడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమె రాజకీయ జీవితంలో ఎక్కువకాలం కాంగ్రెస్లో పనిచేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. సుమారు ఏడాదిన్నర క్రితం టీడీపీకి కూడా రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కుతూహలమ్మ 1985లో వేపంజేరి (ప్రస్తుతం జీడీ నెల్లూరు) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే స్థానం నుంచి 1989, 1999, 2004లోనూ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Also Read : ట్రాక్టర్ను ఢీకొట్టిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు..
దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. 2007లో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. 1994లో కాంగ్రెస్ సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జీడీ నెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆమె టీడీపీలో చేరారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో జీడీనెల్లూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube