దినదిన బొగ్గుకు గండం
– ఒక్క రోజుకే నిల్వలు
-దేశంలోనే కనిష్ట నిల్వలు ఎపిజెన్కోనే
టీ మీడియా, మార్చ్ 7,అమరావతి : రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల పరిస్థితి దినదినగండంగా మారింది. ప్లాంట్లకు ఒక్క రోజు బొగ్గు ఆగినా అందులో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. కనీసం 15 రోజులకు 10,73,835 మెట్రిక్ టన్ను(ఎం.టి)ల బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా దానిలో కేవలం 3శాతం బొగ్గు మాత్రమే జెన్కో ప్లాంట్లో ప్రస్తుతం ఉంది. దీనిని సెంట్రల్ ఎలక్ట్రిసిటి అథారిటీ (సిఇఎ) సైతం ధృవీకరించింది. ఫలితంగా దేశంలోనే అత్యంత తక్కువ బొగ్గు కలిగిన ప్లాంట్లు ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థగా ఎపి జెన్కో నిలిచింది. రాష్ట్రంలో జెన్కో ఆధ్వర్యంలో మూడు థర్మల్ ప్లాంట్లు నడుస్తున్నాయి. ఇవి నడవాలంటే రోజుకు 71,589 ఎం.టిల బొగ్గు అవసరం. ప్రస్తుతం మూడు ప్లాంట్లలో కలిపి ఒక రోజుకు సరిపడ మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నట్లు సమాచారం. కష్టపడితే మరో అరరోజుకు సర్ధుబాటు చేయగలమని అధికారులు అంటున్నారు. దీంతో సరఫరాలు అత్యంత కీలకంగా మారాయి. రైలుమార్గం ద్వారా జరిగే ఈ సరఫరాలో ఏ మాత్రం ఆటంకం ఏర్పడినా కోతలు అంధకారం నెలకొనే ప్రమాదం ఉంది.
Also Read : త్వరలో రిటైల్ వ్యాపార పాలసీ : కేంద్రం
ఏ ప్లాంటులో ఎంత నిలువ ?
విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్(విటిపిఎస్)లో విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 28,500 మిలియన్ టన్ను(ఎం.టి)లు బొగ్గు అవసరం. ప్రస్తుతం అక్కడ 9,800ఎంటిల బొగ్గు మాత్రమే ఉంది. ఇది పదహేనురోజుల్లో ఉండాల్సిన నిల్వలతో పోలిస్తే కేవలం ఒక్క శాతం మాత్రమే! రాయలసీమ థర్మల్ ప్లాంట్కు రోజుకు 21వేల ఎంటిల బొగ్గు కావాల్సి ఉండగా ప్రస్తుతం అక్కడ 16,028 ఎంటిలు మాత్రమే ఉంది. పదహేను రోజుల కనీస నిల్వను ప్రామాణికంగా తీసుకుంటే ఇది రెండు శాతం మాత్రమే! నెల్లూరులోని కృష్ణపట్నం ప్లాంట్కు రోజుకు 19,000ఎంటిల బొగ్గు కావాల్సిఉండగా, అక్కడ 42,582 ఎంటిల నిల్వ ఉది. 15 రోజులకు కావాల్సిన దానిలో ఇది 7శాతం మాత్రమే! ఈ ప్లాంటును కొంత విదేశీ బొగ్గుతో నడపాల్సి ఉండగా, అది అందుబాటులో లేకపోవడంతో స్వదేశీ బొగ్గుతోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. కృష్ణపట్నంలో మొత్తం మూడు యూనిట్లు నడుస్తున్నాయి. రెండో దశ యూనిట్ను ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించగా ప్రస్తుతం అక్కడ ట్రయల్ రన్ దశ జరుగుతోంది. సరిపడి బొగ్గు లేకపోవడంతో కేవలం అక్కడ రెండు యూనిట్లలో మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది.
ఎందుకీ స్థితి ?
రాష్ట్రాల జెన్కో ప్లాంట్లకు సరిపడ బొగ్గును కోల్ ఇండియా సరఫరా చేయడం లేదు. మరోవైపు ఎపి జెన్కో యాజమాన్యం వైఫల్యం కూడా కనిపిస్తోంది. రాష్ట్ర జెన్కోలకు సరిపడ అందించలేని కోల్ ఇండి యా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన ్(ఎన్ట ిపిసి)లకు, ప్రైవేట్ ఉత్పత్తి ప్లాంట్లకు అందిస్తుంది. నిబంధనల ప్రకారం 15 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలను ప్లాంట్లు సమకూర్చుకోవాలి. ఎన్టిపిసి ప్లాంట్లు 15 రోజులకు సరిపడ బొగ్గులో 62శాతం ఉంచుకుంటూ, ప్రైవేట్ ప్లాంట్లకు 52శాతాన్ని అందిస్తుంది. జెన్కోలకు మాత్రం తక్కువ స్థాయిలో సరఫరా చేస్తోంది. ప్లాంట్లకు అవసరమైన బొగ్గును జెన్కో రైల్ మార్గం ద్వారా తెప్పించుకుంటుంది. రాష్ట్రంలో ఉన్న ప్లాంట్లకు అవసరమైన బొగ్గును జెన్కో మహనది బొగ్గు గనుల నుంచి రావాల్సి ఉంది. అయితే మహనదికి బకాయిలు ఉండడంతో అవసరమైన బొగ్గు రావడం లేదు. కేవలం రోజు వారి చెల్లింపులు ద్వారా మాత్రమే బొగ్గును జెన్కో తెచ్చుకుంటోంది. బొగ్గు సరఫరాలో ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం రాష్ట్రంలో కరెంట్ కోతలు తప్పవని విద్యుత్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు
ప్రస్తుత డిమాండ్ ఎంత
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 228 మిలియన్ యూనిట్లు(ఎంయు) విద్యుత్ డిమాండ్ ఉంది. జెన్కో నుంచి 100(ఎంయు), కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి 40(ఎంయు), హిందుజా నుంచి 17ఎంయు, సోలార్ విద్యుత్ 30ఎంయుల వరకు విద్యుత్ వస్తుంది. మిగిలిన కొరతను డిస్కంలు పవర్ ఎక్స్చేంజ్ మార్కెట్ నుంచి యూనిట్ సరాసరి రూ.8ల వరకు కొనుగోలు చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్లాంట్లలో 15 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు సమకూర్చుకోవాలి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube