ఓబీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే
– బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
టీ మీడియా, నవంబర్ 2, హైదరాబాద్ : ఓబీసీలంటే కాంగ్రెస్ పార్టీకి అంత చులకనా.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో హస్తంపార్టీకి బీసీల దమ్మేంటో చూపించాలన్నారు. అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ అగ్రనేత చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. భారతదేశాన్ని 50 ఏండ్లకుపైగా పాలించిన ఆ పార్టీ.. ఏనాడూ ఓబీసీ కులగణన చేయాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు. అధికారం కోల్పోయి పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని తెలిసి రాహుల్ గాంధీ ఓబీసీల జపం చేయడం కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని బీజేపీ బీసీని సీఎం ఎట్లా చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. అది బీసీలను అవమానించడమేనని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణలో బీసీ సీఎం కాకుండా చేస్తున్న కుట్రలో భాగంగానే ఉన్నాయన్నారు. బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే ఓట్లు అడగాలని తెలిపారు. బీజేపీని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్కు లేదని చెప్పారు.
Also Read : బీఆర్ఎస్లోకి చేరికల జోరు..
50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా 50 శాతానికిపైగా జనాభా ఉన్న ఓబీసీ వ్యక్తిని ప్రధానమంత్రిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రతిపక్ష స్థానం కోల్పోయి కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకమయ్యాకే ఓబీసీ కులగణన గుర్తు కొచ్చిందా అని నిలదీశారు. తెలంగాణలో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని పార్టీగా హీనదశకు చేరిన తరువాత ఓబీసీలు గుర్తుకొచ్చారా అన్నారు. పార్లమెంట్లో పట్టుమని 10 శాతం సీట్లు కూడా లేని పార్టీ కాంగ్రెస్ అని, ప్రతిపక్ష స్థానం కోల్పోయి మరణశయ్యపై ఊగిసలాడుతున్న ఆ పార్టీ ఓబీసీ కులగణన ఎలా చేపడుతుందో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓబీసీ జపం చేస్తున్న రాహుల్.. ఈ ఎన్నికల్లో ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఓబీసీ కులగణన విషయంలో రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా అని నిలదీశారు. ఈ మేరకు ప్రకటన చేసే సత్తా ఉందా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీలపట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ పార్టీని బీసీలే రాజకీయ సమాధి చేయడం తథ్యమన్నారు. బీసీలంతా ఏకమై దమ్ము చూపే సమయమొచ్చిందని, బీసీలను అడుగడుగునా అవమానిస్తునన్న కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని కోరారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube