తెలుగింటి సత్యభామ.. జమున ఇకలేరు
టీ మీడియా,జనవరి27,హైదరాబాద్ : తెలుగింటి సత్యభామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జమున (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా వయోసంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జమున.. హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జమున.. 1936 ఆగస్ట్ 30న నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు హంపీలో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఆమెపేరు జానాబాయి. అయితే జ్యోతిషుల సూచనతో ఆమె పేరును జమునగా మార్చారు. తండ్రి వ్యాపార రీత్యా.. ఆమె బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. తల్లి దగ్గరే సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. నటుడు జగ్గయ్య.. ఖిల్జీరాజు పతనం అనే నాటకంలో పాత్రకోసం జమునను ఎంపిక చేశారు. అనంతరం ఆమె అడుగులు సినిమావైపు పడ్డారు. 14 ఏండ్ల వయస్సులోనే సినిమాల్లోకి ప్రవేశించారు.
1953లో నటించిన పుట్టిల్లు ఆమె తొలిచిత్రం. అయితే ‘అంతా మనవాళ్లే’ సినిమాతో ఆమె కెరీర్ మలుపుతిరిగింది. నిరుపేదలు, మా గోపీ, బంగారుపాప సినిమాలు ఆమెకు మంచిపేరు తీసుకొచ్చాయి. మిస్సమ్మ సినిమాలో ఆమె నటన అందరినీ ఆకట్టుకున్నది. రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించినప్పటికీ.. ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించిపోయారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 198 సినిమాల్లో ఆమె నటించారు. ఇందులో తెలుగులో 145 సినిమాలు ఉండగా, తమిళం 20, కన్నడం 7, హిందీలో 10 చిత్రాల చొప్పున ఉన్నాయి. 1959 నుంచి సావిత్రితోపాటే స్వర్ణయుంగం చూసిన జమున.. తెనాలి రామకృష్ణ, భాగ్యరేఖ, భూకైలాస్, దొంగల్లో దొర, ఇలవేల్పు, ఇల్లరికం, ముద్దుబిడ్డ, చిరంజీవులు, మిస్సమ్మ, మూగమనసులు, శ్రీకృష్ణ తులాభారం, రాముడు-భీముడు, తోడు-నీడ, రాము, లేతమనసులు, పూలరంగడు, ఉండమ్మా బొట్టు పెడతా, గులేబకావళి కథ, బొబ్బిలియుద్ధం, మంచి మనిషి సినిమాల్లో ఆమెకు మంచి పేరువచ్చింది.1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 1968లో మరోసారి ఉత్తమ సహాయ నటిగా ఎంపికయ్యారు. మిలాన్ చిత్రంలో గౌరీ పాత్రకు బాలీవుడ్ ఫిల్మ్ఫేర్ లభించింది. 2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు.
Also Read : దీవులకు పరమ్వీర్ చక్ర గ్రహీతల పేర్లు
చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తొలితరం నాయిక జమున కావడం విశేషం. భర్త, పిల్లల కోసం ఆమె తన మకాంను హైదరాబాద్ బంజారాహిల్స్కు మార్చారు. ఇక్కడి వచ్చినతర్వాత ఆమెకు రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆహ్వానంతో 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో మంగళగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 1989లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. 1991 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీచేయగా ఓటమిచవిచూశారు. రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube