టీఎస్ ఆర్టీసీ ‘బాలాజీ దర్శన్’కు విశేష స్పందన
లహరి, ఫిబ్రవరి 7, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన ‘బాలాజీ దర్శన్’కు విశేష స్పందన లభిస్తున్నది. గత ఏడు నెలల్లో ఇప్పటి వరకు 77,200 మంది భక్తులు టికెట్లను బుక్ చేసుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గతేడాది జూలై 3109, ఆగస్ట్లో 12,092, సెప్టెంబర్లో 11,586, అక్టోబర్లో 14,737, నవంబర్లో 14,602, డిసెంబర్లో 6,890, ఈ ఏడాది జనవరిలో 14,182 మంది భక్తులు బస్టికెట్తో పాటు శ్రీవారి శీఘ్ర దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నారు. రాష్ట్రం నుంచి తిరుమల వెళ్లే భక్తుల కోసం గతేడాది జూలై నుంచి ‘బాలాజీ దర్శన్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలకు వెళ్లే సమయంలో బస్ టికెట్ బుకు చేసుకునే సమయంలో శ్రీవారి దర్శన టికెట్ను బుక్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. ఇందు కోసం టీటీడీతో తెలంగాణ ఆర్టీసీ ఒప్పందాన్ని కుదుర్చుకోగా.. మంచి స్పందన వస్తున్నది. ఇదిలా ఉండగా.. ఈ నెలలో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఎక్కువగా ఉండడంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. ప్రయాణ టికెట్తో పాటు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ను సంస్థ అందిస్తుందని, దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ప్రయాణించి వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.
Also Read : పల్లె పల్లెకు అఖిలపక్ష ఐక్యవేదిక
బాలాలయ మహా సంప్రోణను టీటీడీ వాయిదా వేసినందున ఈ నెల 23 నుంచి మార్చి 1 వరకు బ్లాక్ చేసిన శీఘ్ర దర్శనం టికెట్లను తిరిగి విడుదల చేయనున్నది. ఈ క్రమంలో తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు tsrtconline.in వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోవాలని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. బాలాజీ దర్శన్ టికెట్లను కనీసం వారం రోజుల ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube