‘మై లార్డ్’ అని అనడం ఆపండి.. నా జీతంలో సగం ఇస్తా
– సుప్రీంకోర్టు న్యాయమూర్తి
టీ మీడియా, నవంబర్ 3, న్యూఢిల్లీ: కోర్టులో విచారణ సందర్భంగా న్యాయవాదులు పదే పదే న్యాయమూర్తులను ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్షిప్స్’ అని సంబోధించడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసంతృప్తి చెందారు. ఆ సీనియర్ న్యాయవాది అలా అనడం ఆపితే తన జీతంలో సగం ఇస్తానని అన్నారు. బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏఎస్ బొపన్న, పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఒక పిటిషన్పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పలుమార్లు ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్షిప్స్’ అని న్యాయమూర్తులను సంబోధించారు. కాగా, బ్రిటీష్ వలస పాలన నాటి ఈ పదాలు వాడకంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీఎస్ నరసింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మై లార్డ్స్’ అని ఎన్నిసార్లు చెబుతావు. ఇలా చెప్పడం మానేస్తే నా జీతంలో సగం ఇస్తా’ అని ఆ సీనియర్ న్యాయవాదితో అన్నారు. ‘‘మై లార్డ్స్’ కు బదులుగా ‘సర్’ అని ఎందుకు అనకూడదు’ అని ప్రశ్నించారు.
Also Read : పోలీసు వృత్తి అత్యంత కఠినవంతమైనది
‘మై లార్డ్స్’ అని ఆ సీనియర్ లాయర్ ఎన్నిసార్లు అంటారో తాను లెక్కపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఏ న్యాయవాది కూడా న్యాయమూర్తులను ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్షిప్’ అని సంబోధించ కూడదన్న తీర్మానాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2006లో ఆమోదించింది. అయినప్పటికీ న్యాయవాదులు దానిని పాటించడం లేదు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube