సుబ్బారావు గుప్తా అరెస్ట్
-గతంలో ‘బాలినేని’పై
-విమర్శలు చేసిన ‘సోమిశెట్టి’
టీ మీడియా, మార్చ్ 2, ఒంగోలు క్రైం : ప్రకాశం జిల్లా ఒంగోలు వైసిపిలోని రెబల్ కార్యకర్తగా ఉన్న సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై తాలూకా పోలీస్ స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆయనను పోలీసులు బుధవారం అరెస్టు చేసి విచారిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం… ఒంగోలులోగల వెంకటేశ్వర కాలనీ అడ్డరోడ్డులోని టీ స్టాల్ వద్ద పోలీసులు ఉన్నారు. అదే సమయంలో మోటార్ సైకిల్పై ఒంగోలు వైపు వెళ్తున్న సుబ్బారావు గుప్తా వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు ఆయనను వాహనంతో సహా పట్టుకొని విచారించారు. తన వాహనంలోని సంచిలో గంజాయి ఉందని, అందుకే మిమ్మల్ని చూసి పారిపోతున్నానని పోలీసులకు సుబ్బారావు గుప్తా చెప్పారు. పోలీసులు ఆయన నుంచి ఒక కిలో ఐదు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుప్తాను అరెస్టు చేసి గంజాయి కేసు నమోదు చేశామని, ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయనపై క్రైమ్ నెంబర్ 81/ 2022 యుఎస్ ఎస్సి/ఎస్టి సెక్షన్ క్రింద గతంలో ఒక కేసు నమోదై ఉందని డిఎస్పి నాగరాజు తెలిపారు.
Also Read : సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
గుప్తాపై గతంలో దాడి
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై గతంలో చాలాసార్లు సుబ్బారావు గుప్తా విమర్శలు చేశారు. దీంతో, బాలినేని అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో గుంటూరు వెళ్లి ఆయన తలదాచుకున్నారు.
బాలినేని అనుచరులు అక్కడికి వెళ్లి మరీ గుప్తాపై దాడి చేశారు. ఇది సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయింది. రాష్ట్ర స్థాయిలో ఆర్యవైశ్య నాయకులు గుప్తాకు అండగా రావడంతో వైసిపి ముఖ్య నేతలు సమస్య తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత కూడా బాలినేని కుమారుడు ప్రణీత్రెడ్డిపై నగరంలో భూకబ్జాలు, ఇతర అంశాలపై సుబ్బారావు గుప్తా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
వైసిపి ముఖ్యనేతలకు వ్యతిరేకంగా ఢిల్లీలోనూ నిరసన తెలిపారు. కేంద్రంలోని పెద్దలనూ కలిశారు. రెండు రోజుల క్రితం బాలినేని కుమారుడు ప్రణీత్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు నమోదు కావడం, ఆయనను అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది.