సెంట్రల్ వర్సిటీల్లో యూజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే..
టీ మీడియా , మార్చి 28,హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీ ల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2022 -23 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి. పరీక్షా విధానం ఆబ్జెక్టివ్ టైప్లో, కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఉంటుందని ప్రకటించాయి.ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగానే సెంట్రల్ యూనివర్సిటీలు వేర్వేరుగా కౌన్సిలింగ్ను నిర్వహించి సీట్లను భర్తీచేస్తాయి. ఇంతకాలం ఒక్కో యూనివర్సిటీ వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు కల్పించేవి. తాజా సీయూఈటీతో దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలు అన్నింటిలో ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్ను జూలైలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే ఈ ప్రవేశ పరీక్షలో ప్రశ్నలు అడుగుతారు.
Also Read : సార్వత్రిక సమ్మెకు మద్దతు
రాష్ట్రంలో..
ఈ నోటిఫికేషన్ ద్వారానే మన రాష్ట్రంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ), మౌలానా అబుల్ కలాం అజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మాను), ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ (ఇప్లూ)ల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం 02-04-2022
సమర్పణకు తుది గడువు 30-04-2022
హెల్ప్లైన్ నంబర్లు 011 40759000, 69227700
సెక్షన్ 1– 13 భాషలు, సెక్షన్ 1B – 19 భాషలు (వీటిల్లో ఏభాషనైనా ఎంచుకోవచ్చు, మొత్తం 50 ప్రశ్నలిస్తారు. విద్యార్థి 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది, ఇందుకు 45 నిమిషాల సమయమిస్తారు)
సెక్షన్ 2 – 27 సబ్జెక్టులు (విద్యార్థి ఏదేని 6 సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఆయా సబ్జెక్టులు అడ్మిషన్ పొందగోరే యూనివర్సిటీలో ఉండాలి. 50 ప్రశ్నలకు గాను 40 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. 45 నిమిషాల సమయమిస్తారు.జనరల్ టెస్ట్ (జీకే, కరంట్ అఫైర్స్, జనరల్, మెంటల్, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్ల నుంచి 75 ప్రశ్నలిస్తారు. విద్యార్థి 60 ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. ఇందుకు 60 నిమిషాల సమయం ఉంటుంది.