చంద్రుడిలో హెచ్చుతగ్గులు ఎందుకుంటాయి.?
లహరి, అక్టోబర్ 29, కల్చరల్ : నెలకు 30 రోజులు…తిథులు 15..ఇందులో పౌర్ణమి ముందు శుక్ల పక్షం అని , అమావాస్య ముందు బహుళ పక్షం అని అంటారు. అంటే మొదటి 15 రోజుల్లో పౌర్ణమి..ఆ తర్వాత 15 రోజుల్లో చివరి రోజు అమావాస్య. శుక్ల పక్ష పాడ్యమితో తెలుగు నెల మొదలై అమావాస్యతో ముగుస్తుంది. శుక్ల పక్ష పాడ్యమి నుంచి చంద్రుడు రోజు రోజుకీ పెరుగుతూ పౌర్ణమి నాటికి నిండు బింబంలా కనిపిస్తాడు. పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి రోజు రోజుకీ తగ్గుతూ అమావాస్య వచ్చేసరికి అస్సలు కనిపించడు. ఇంతకీ చంద్రుడు ఇలా తగ్గుతూ పెరుగుతూ ఉంటాడెందుకు? నిత్యం ఒకేలా ఉండొచ్చుకదా అనే సందేహం కొందరికి రావొచ్చు.. దీని వెనుక ఓ పురాణ గాథ చెబుతారు పండితులు.
చంద్రుడికి శాపం :
చంద్రుడు అనసూయ దేవి కుమారుడు. దక్షుడు చంద్రుడిని తన అల్లుడిగా చేసుకోవాలి అని అనుకుంటాడు. పురాణాల్లో ఉన్న ప్రకారం దక్షుడికి 27 మంది కుమార్తెలు (ఆ 27 మంది అశ్విని నుంచి రేవతి వరకూ చెప్పుకునే నక్షత్రాలు). వారిలో కేవలం ఒకరిని మాత్రమే చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక తన 27 మంది కుమార్తెలను కలిపి చంద్రుడు కి ఇచ్చి పెళ్లి చేశారు. చంద్రుడు తన 27 మంది కుమార్తెలును సమానంగా చూసుకుంటాడని దక్షుడు భావిస్తాడు..ఈ మేరకు మాట తీసుకుంటాడు కూడా. కానీ చంద్రుడు మాట తప్పుతాడు. 27 మంది భార్యలు ఉన్నా రోహిణి అంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. మిగిలిన వారిని సరిగ్గా పట్టించుకోడు. 26 మంది కుమార్తెలు తండ్రి దక్షుడుకి ఫిర్యాదు చేస్తారు. ఈ విషయం మీద చంద్రుడుని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో దక్షుడు కోపంతో చంద్రుడికి శాపం ఇస్తాడు. రోజు రోజుకు వెలుగు తగ్గిపోతూ అంతమవుతావంటూ శపిస్తాడు.
Also Read : కాంగ్రెస్ అమ్ముడుపోతుంది.. బిఆర్ఎస్ కొనుగోలు చేస్తుంది
చంద్ర శేఖరుడు :
భయంతో ఏం చేయాలో తెలియక చంద్రుడు శాపవిమోచనం కోసం ముల్లోకాల్లో ఉన్న దేవతల వద్దకు వెళ్తాడు. దక్షుడు బ్రహ్మదేవుడి కుమారుడు కావడంతో చంద్రుడునికి సహాయం చేయలేను అని తిరిగి పంపించేస్తారు.శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లినా ఫలితం ఉండదు. చివరి ప్రయత్నంగా మహా శివుడు వద్దకు వెళతారు చంద్రుడు. అడిగిన వారికి అడిగినట్లు వరాలు ఇచ్చే భోళాశంకరుడు…దక్షుడి శాపంలో అర్థం ఉందని చెప్పి…అప్పుడు మధ్యే మార్గంగా ఓ ఉపాయం ఆలోచిస్తాడు. లోక కళ్యాణార్థం 15 రోజులు పాటు క్షీణించి తిరిగి 15 రోజులు పాటు నీవు వెలుగు నింపుతావు అని మహా శివుడు ఆశీర్వదిస్తాడు. సంతోషించిన చంద్రుడు భక్తితో తనను తాను సమర్పించుకుంటాడు. అప్పటి నుంచీ చంద్రుడిని సిగలో ధరించి చంద్రశేఖరుడిగా మారాడు శివుడు
Also Read : ఐఎంసి 7వ ఎడిషన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు :
ఆకాశంలోని చంద్రుడిని ఎప్పుడు చూసినా కొత్తగా కనిపిస్తాడు. చిన్నారుల నుంచి పెద్దల వరకూ ఆహ్లాదాన్ని పంచుతాడు. నవగ్రహాలలో రెండవ స్థానంలో దర్శనమిచ్చే చంద్రుడు, కర్కాటక రాశికి అధిపతిగా చెబుతారు. చంద్రగ్రహ సంబంధమైన దోషాలతో బాధపడుతున్నవాళ్లు ఆ దోషాల నుంచి విముక్తి పొందేందుకు ముత్యం ధరించాలని, శంఖం దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. చంద్రుడికి తేనెతో కూడిన పిండివంటలంటే చాలా ఇష్టమట. అందువలన పౌర్ణమి రోజున ఆయనకి వాటిని రాగిపాత్రలో నైవేద్యంగా సమర్పించాలంటారు.