ప్రపంచ ఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం
లహరి, పిబ్రవరి23, పుట్టపర్తి : కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు అంచెలంచెలుగా ఎదిగి.. ప్రపంచ గుర్తింపు పొందుతాయి. ఆ కోవకు చెందిందే పుట్టపర్తి. ఇక్కడి ప్రతి అడుగులోనూ సేవాభావం పలకరిస్తుంది. సమానత్వం ఆహ్వానం పలుకుతుంది. స్థాపించివారు లేకున్నా.. వారి భావాలు నేటికీ ఈ నేలపై పదిలంగానే ఉన్నాయి. వారి ఆలోచనలు ఆచరణలోనే ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంగానేకాకుండా పర్యాటక ప్రదేశంగానూ పేరొందిన ఆ పుట్టపర్తి విశేషాలను తెలుసుకుందాం రండి! ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తి దేశానికే తలమానికంగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు. దశాబ్దాల క్రితం ఓ చిన్న గ్రామంగా ఉన్న పుట్టపర్తి నేడు ప్రపంచ ఖ్యాతిని గడించిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.
అందుకు ప్రధాన కారణం ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా. ఆయన ప్రభావంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందిన సంగతి తెలిసిందే. చిత్రావతి నది ఒడ్డున ఉన్న పుట్టపర్తిలో ఆయన 1950లో ప్రశాంతి నిలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా పుట్టపర్తిలో సందర్శకుల తాకిడి పెరుగుతూ వచ్చింది. నేటికీ కొనసాగుతోంది. విదేశీయులను ఆకర్షించిన నేలగా.. ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా ప్రశాంతి నిలయంలో అందించే ప్రవచనాలు వినేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసేవారు. దీంతో ప్రపంచస్థాయిలోనూ పుట్టపర్తికి ప్రత్యేక గుర్తింపు లభించింది. పుట్టపర్తి కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా విద్యా, ఆరోగ్య కేంద్రంగానూ భాసిల్లుతోంది. సత్యసాయి బాబా తాత కొండమ రాజు నిర్మించిన మసీదు, హనుమాన్ ఆలయం, సత్యభామ ఆలయాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆధ్యాత్మికనే కాకుండా ఇక్కడి నిర్మాణ శైలి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే కుటుంబసమేతంగా ఇక్కడ వాలిపోతుంటారు చాలామంది ఔత్సాహిక పర్యాటకులు. షిర్డీ సాయి అవతారంగా ఖ్యాతి.. ఈ పట్టణాన్ని ఒకప్పుడు గొల్లపల్లి అని పిలిచేవారు. ఇది సముద్ర మట్టానికి 475 మీటర్ల ఎత్తులో ఉంది. పెద్ద వెంకప్ప, ఈశ్వరమ్మ దంపతులకు నవంబర్ 23, 1926వ సంవత్సరంలో జన్మించిన సత్యనారాయణ రాజు (సత్యసాయి)ను అక్కడి షిర్డీ సాయి అవతారంగా భావించేవారు.
Also Read : వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మినరసింహ స్వామి దేవాలయం
అలా ఆయన పుట్టపర్తి సత్యసాయి బాబాగా ప్రపంచ స్థాయిలో ఖ్యాతిగాంచారు. పుట్టపర్తిలో నిర్మించిన ప్రశాంతి నిలయానికి సత్యసాయి బాబే ఆర్కిటెక్ట్, ఇంజినీరుగా వ్యవహరించారని చెబుతారు. చిత్రావతి నది ఒడ్డున ఉన్న వృక్షం, విశ్వవిద్యాలయం వైపు ఉన్న కొండ మీద ఉన్న ధ్యానం చెట్టును భక్తులు సందర్శిస్తుంటారు. పుట్టపర్తిలో చూడదగిన మరికొన్ని ప్రాంతాలు.. ఈ ప్రాంతంలో ప్రతిచోటా ఓ సరికొత్త పర్యాటక అనుభూతి కనిపిస్తుంది. ఇక్కడ చూడదగిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. పుట్టపర్తిని సందర్శించేవారు సత్యసాయి ఆశ్రమం, చైతన్య జ్యోతి మ్యూజియం, కోరికలు తీర్చే చింత చెట్టు (కల్ప వృక్షం), శ్రీసత్యసాయి స్పేస్ థియేటర్, ఆశ్రమంలోని ధాన్య వృక్షం, ఆంజనేయస్వామి ఆలయం, గోకులం, గణేష్ గేట్ (గోపురం), సత్యసాయి హిల్ వ్యూ స్టేడియం, సంతాన సంస్కృతి, తదితర ప్రాంతాలను చూడటం అస్సలు మరిచిపోవద్దు. ఎలా చేరుకోవాలి? పుట్టపర్తి చేరుకునేందుకు బస్సు, రైలు, విమాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పుట్టపర్తి ఆశ్రమానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలోనే శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ ఉంది. ఈ పట్టణం పుట్టపర్తికి 96 కిమీల దూరంలో ఉంటుంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube